-
-
By Chowdary
Updated :
19 November 2025 11:38 AM
ఇంటర్నెట్డెస్క్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం (Saudi Bus Tragedy)లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Andhra Pradesh Governor S Abdul Nazeer) నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ బృందం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.
ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖతో సహా సౌదీ అధికారుల సమన్వయంతో బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించేందుకు.. పనులను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి బృందం సౌదీని సందర్శిస్తోందని తెలిపింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్కుమార్ ఛటర్జీ కూడా వెళ్లనున్నట్లు వెల్లడించింది. మృతుల అంత్యక్రియల్లో ఈ బృందం పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించింది.